శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): టీనేజ్ యువత సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉంటూ తెలియని వ్యక్తులకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదని మార్తాండనగర్ వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు నాగనబోయిన హైమావతి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహిళా శిశు దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మార్తాండనగర్ అంగన్ వాడీ కేంద్రం-2లో చైల్డ్ సేఫ్టీ వీక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శేరిలింగంపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆదిత్యనగర్ సెక్టార్ సూపర్ వైజర్ ఠాకూర్ కోమలాబాయి మాట్లాడుతూ అమ్మాయిలకు చిన్న వయస్సులో పెళ్లి చేయడం వల్ల తల్లి ఆరోగ్యానికి ప్రమాదకరమని, బిడ్డ బలహీనంగా పుట్టడం, చదువు ఆగిపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం జరుగుతుందని, అందుకే అమ్మాయిలకు 18 సంవత్సరాల వయస్సు నిండిన తరువాతే వివాహం చేయాలని కోరారు. ఐసీపీఎస్ సరస్వతి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలతో ప్రతి రోజూ మాట్లాడాలని, నమ్మకం పెంచాలని, గైడెన్స్ ఇవ్వాలని, సరైన సలహాలు, మంచి దారి చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఏ డి.సునంద, సీఆర్పీలు గీత, దుర్గ, అంగన్ వాడీ కార్యకర్తలు మణిజ్యోతి, నాగశ్రీలత, లక్ష్మీ ప్రవీణ, కల్యాణి, ఖైరున్నీసా, లక్ష్మీకాంతం, శైలజ, షీలా, ఆశ కార్యకర్తలు హలీమా, రేష్మ, కిశోర, బాలికలు, కాలనీవాసులు పాల్గొన్నారు.






