శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): ఎప్పుడూ అధికారానికే కాదు, ప్రజల హక్కుల కోసం పోరాడుతూ, స్వాతంత్ర్య సమరంలో, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందే ఉంటుందని, పార్టీ సిద్ధాంతాలను నమ్మిన ప్రజల కోసం సేవాదళ్ అండగా ఉంటుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న సమర్థ-శిక్షణ శిబిరంలో రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే సేవ, సేవ అంటే ప్రజల గెలుపు అని, ప్రజల పక్షాన పోరాటమే సేవాలాల్ ధర్మం అని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో, దేశ నిర్మాణంలో యువత పాత్రను మరింత బలపరచాలనే ఉద్దేశంతో, ప్రతి కార్యకర్తను సిద్ధం చేసే దిశగా ఈ సమర్ధ శిక్షణ శిబిరం నిర్వహించబడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు విజయభాస్కర్ రెడ్డి, సౌందర్య రాజన్, యలమంచి ఉదయ్ కిరణ్, సేవాదళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






