శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) ఆధ్వర్యంలో ముజఫర్ అహ్మద్ నగర్ లోని తాండ్ర రామచంద్రయ్య భవన్ లో ఎం.శ్రీకాంత్ అధ్యక్షతన విద్యార్థులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసినా సర్టిఫికెట్లు తెచ్చుకోలేక స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్గా జీవనం కొనసాగించాల్సిన దుస్థితి తెలంగాణలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అనంతరం గ్రేటర్ హైదరాబాద్ నూతన కమిటీని ప్రకటించారు. కమిటీ కార్యదర్శిగా ముత్తన్నగారి శ్రీకాంత్, అధ్యక్షుడిగా జి.అరుణ్ కుమార్, కార్యనిర్వాహణ అధ్యక్షుడిగా సాయి యాదవ్, ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్, సహాయ కార్యదర్శిగా ఎస్. ఈశ్వర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ గా నవీన్ యాదవ్, కోశాధికారిగా జె.డి. గణేష్, కమిటీ సభ్యులుగా ప్రవీణ్, బి. రిషిక్, ఎస్. శ్రీరామ్, ఎ. వివేక్, పి. సాయి, జాస్మిన్ రాజ్, దుర్గాప్రసాద్ లు నియామకం అయ్యారు. యువజన రాష్ట్ర కార్యదర్శి వనం సుధాకర్ నూతన కమిటీని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యలో జరుగుతున్న దోపిడీపై పోరాటాలు నిర్వహించాలని, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలను నిలదీయాలని, ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇస్లావత్ దశరథ్ నాయక్ పాల్గొన్నారు.





