శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని మియాపూర్ డివిజన్ కి చెందిన దోనెపూడి రమాదేవి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించి, మహిళలు గౌరవంగా జీవించేలా చేశారని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మహిళాభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. మహాలక్ష్మి స్కీమ్, ఆరోగ్య లక్ష్మి, ఉమెన్ ఎంటర్ప్రిన్యూర్ షిప్, మహాలక్ష్మి ఫైనాన్సియల్ అసిస్టెన్స్, ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, షీ టీమ్స్, బాలామృతం, మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్, చీఫ్ మినిస్టర్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్, ఉమెన్ ఎంటర్ప్రిన్యూర్ సపోర్ట్ స్కీమ్ లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఆమె తెలిపారు. అలాగే చట్ట సభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడం వల్ల మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. రాబోయే మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి భారత పార్లమెంట్ వరకు అన్ని పార్టీలలో, అలాగే అన్ని రంగాలలో మహిళల ప్రతిభను గమనిస్తున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీల మద్దతు తప్పక ఉంటుందని అన్నారు. పహల్గామ్ తీవ్రవాద దాడులకు వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ లో ఇండియన్ ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ లాంటి మహిళా ఆఫీసర్స్ పోరాట పటిమ, ధైర్య సాహసాలు చూశామని అన్నారు. అవకాశం వస్తే మహిళలు కూడా ఆయా రంగాలలో రాణిస్తారని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మహిళా బిల్లుకి మద్దతు తెలపాలని కోరారు.






