శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ అధికారులు భారీ స్థాయిలో నకిలీ పత్రాల కేసును ఛేదించారు. మోసం, ఫోర్జరీ, నకిలీ పత్రాల వినియోగం, అక్రమ ప్రవేశం, కుట్ర వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన ఈ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం గతేడాది అక్టోబర్ 28న అందిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చందానగర్ గ్రామంలోని సర్వే నంబర్లు 373, 374, 375లో ఉన్న ప్రభుత్వ భూమిని నిందితులు ఆక్రమించినట్లు గుర్తించారు. ఈ భూమి సామాజిక సంక్షేమ శాఖకు చెందిందని, బలహీన వర్గాల గృహ నిర్మాణం, సామాజిక అవసరాల కోసం కేటాయించబడిందని తేల్చారు.

నిందితులు ముందస్తుగా కుట్ర పన్ని GHMC హౌస్ నంబర్లను నకిలీగా సృష్టించారు. అసలు లేని ఇళ్లను ఉన్నట్లుగా చూపిస్తూ ఫేక్ ఫోటోలు తయారు చేశారు. అలాగే నకిలీ PTIN నంబర్లను సృష్టించి రిజిస్ట్రేషన్ డీడ్లు తయారు చేసి ప్రభుత్వ భూమిపై అక్రమ హక్కులు సాధించేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో నిందితులైన నేరుటి నిరంజన్ (A-1), ఎన్. వేణు కుమార్ (A-3), ఎం. కాంతి కుమార్ (A-4), రాజు రవి సెల్వరాజ్ (A-6), సయ్యద్ యూసుఫ్ (A-7), ఎం.డి అజర్ అలీ (A-8), మధం సుమన్ (A-9)లను చందానగర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితులను న్యాయస్థానంలో హాజరు పరచి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.





