శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శేరిలింగంపల్లిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ 6వ ప్లాట్ఫామ్ వద్ద ఓ మృతదేహం పడి ఉందని సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ వృద్ధుడి వయస్సు సుమారుగా 60 నుంచి 65 ఏళ్ల వరకు ఉంటుందని, స్థానికంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడని, వృద్ధాప్య అనారోగ్య సమస్యలు, సరైన ఆహారం లేకపోవడం, వ్యాధులతో బాధపడుతుండడం కారణంగా అతను మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు.






