శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్య 523వ వర్ధంతి సందర్భంగా ఔత్సాహికులకు అన్నమాచార్య భావన వాహినిలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనల ఆలాపనలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 10 నుంచి మార్చి 14 వరకు ప్రతి రోజూ సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు ఈ తరగతులు జరుగుతాయని, వయస్సుతో నిమిత్తం లేకుండా, సంగీత పరిజ్ఞానం లేకున్నా, గాత్రం ఎలా ఉన్నా ఎవరైనా కీర్తనలను నేర్చుకోవచ్చని అన్నారు. అన్నమాచార్య భావనా వాహిని సంస్థ గత 46 సంవత్సరాలుగా అన్నమయ్య కీర్తనల ప్రచారానికి నిర్విరామంగా కృషి చేస్తూనే ఉందన్నారు. పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతిసంవత్సరం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నామని, అన్నమాచార్య సంకీర్తనల ప్రచారమే లక్ష్యంగా ముందుకు సాగే శోభారాజు లాంటి వారి వద్ద కీర్తనలు నేర్చుకోవడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. నేర్చుకోవడం యోగం నేర్పించడమే భోగం అనే నినాదంతో సాగే వేసవి వెన్నెల ఎంతో ఆదరణ పొందిందని, ఇప్పుడు అన్నమాచార్య సంకీర్తనలు నేర్పే మరో బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. వివరాలకు రాజరాజేశ్వరి 94412 76825, పద్మినీ 9611144002, సౌజన్య 95501 29946, పరిమళ 9966002879, రమణ గోరింట్ల 9848024042 ను సంప్రదించి తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.






