శేరిలింగంపల్లి, మార్చి 3 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రేమ వ్యవహారంతో మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నారాయణఖేడ్ గ్రామానికి చెందిన మేఘవత్ సోనీ బాయి (20) మియాపూర్ మక్తాలోని ఫస్ట్ హెల్త్ ల్యాబ్స్లో గత సంవత్సర కాలంగా స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ రెడ్డి ఎన్క్లేవ్ లో పీజీ హాస్టల్ లో ఉంటూ జీవనం కొనసాగిస్తోంది. సోమవారం సోనీ పని వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉంది. గదిలో తోటి స్నేహితులు ఉద్యగాలకు వెళ్లారు. స్నేహితులు రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ రూమ్ కు వచ్చి చూసేసరికి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నాయి. ఎంత పిలిచినా తీయలేదు. దీంతో వారు హాస్టల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. అనంతరం కిటికీలో నుండి చూడగా సోనీ పైకప్పుకు చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే తలపులు బద్దల కొట్టి లోపలికి వెళ్లి కిందికి దించి మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. సహచరులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా తన సొంత గ్రామానికి చెందిన ఓ యువకుడు, ఆమె ప్రేమించుకుంటున్నారని, వారి మధ్య గొడవలతో మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.






