శేరిలింగంపల్లి, డిసెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): పార్టీ సంస్థాగత విషయాలపై శ్రద్ధపెట్టి ప్రజా సమస్యలపై పోరుబాట బట్టి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. కొండాపూర్ మసీదు బండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రవికుమార్ యాదవ్ సమక్షంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది మంచి అవకాశమని, పోటీ చేయాలనుకునే వారు ఇప్పటి నుండే ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించాలని, పోటీలో నిలిచే ప్రతి ఒక్కరికీ తమ నుండి, పార్టీ నుండి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. నియోజకవర్గంలో కొత్త ఓటర్లపై దృష్టి, బోగస్ ఓట్లను తొలగించడం, 21వ తేదీ లోపు డివిజన్ల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్టీ పరమైన బూత్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సూచించారు. బూత్ల వారిగా రోజూ ప్రజలను కలుస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ వారి సమస్యలను గుర్తించి, నాయకుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ అధ్యక్షులు, కంటెస్టెడ్ కార్పొరేటర్స్, యువ మోర్చా, మహిళా మోర్చా, ఎస్సీ, ఎస్టీ మోర్చా, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






