శేరిలింగంపల్లి, డిసెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో డివిజన్లను అస్తవ్యస్తంగా పునర్విభజన చేశారని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. డివిజన్ల ఏర్పాటుపై అభ్యతరం వ్యక్తం చేస్తూ GHMC కమిషనర్ కర్ణన్, చందానగర్ సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్ శశిరేఖకు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నవతా రెడ్డి మాట్లాడుతూ రికార్డులలో లేని మురికి కాలువలను హద్దులుగా చూపించారని, సుప్రీం కోర్టు కేసులో ఉన్న ప్రభుత్య భూమిలో రోడ్ లేకున్నా రోడ్ ఉన్నట్టు హద్దులు చూపించారని అన్నారు. కాలనీలను రెండుగా చీల్చి హద్దులుగా నిర్ణయించారని, బస్తీలన్నీ ఒక డివిజన్ గా , కాలనీ లన్నీ ఒక డివిజన్ గా విడదీశారని, ఒక డివిజన్ కు తక్కువ జనాభా, ఒక డివిజన్ కు ఎక్కువ జనాభా చూపించారని, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. అభ్యంతరం తెలపడానికి కనీసం మ్యాప్ లను కూడా ఇవ్వడం లేదని అన్నారు. డివిజన్లను అస్తవ్యస్తంగా, ప్రజలకు వ్యతిరేకంగా, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అనుకూలంగా విభజించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, రోజా, అల్లావుద్దీన్, గౌస్, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






