శేరిలింగంపల్లి, నవంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల పునరుద్ధరణ పరిరక్షణ చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ సుమారు 7000 మంది విద్యార్థులు, స్థానిక ప్రజలతో తమ్మిడి కుంట వద్ద కలిసి మానవ హారం ఏర్పాటు చేశారు. ఈ సంరద్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలు చెరువులను దత్తత తీసుకోవడంతోపాటు చెరువుల పరిరక్షణకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులను పునరుద్ధరించి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువులకు మహర్దశ పట్టిందన్నారు. ప్రతి ఒక్క చెరువును పునరుద్ధరించి మరమ్మత్తులు చేపట్టడంతోపాటు సుందీకరణ చేసి ఉద్యానవనాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ, మీడియా చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.







