శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా హఫీజ్పేట్ గ్రామవాసులు నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన శేరిలింగంపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి స్ఫూర్తిదాత చాకలి ఐలమ్మ అని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఐలమ్మ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. తన కౌలు భూమిని కొందరు పెత్తందార్లు లాక్కోవాలని చూసినప్పుడు ఒంటరిగా ధైర్యంగా నిలబడి గూండాలను తరిమికొట్టి పంటను కాపాడుకున్న ధైర్యశాలి అని అన్నారు. ఆమె పోరాటమే వేలాది మందికి స్ఫూర్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బోయిన మహేష్ యాదవ్, రాజ్ కుమార్, రవి ముదిరాజ్ , నవీన్ , అశోక్, భిక్షపతి, లక్ష్మణ్, కుమార్ సాగర్ , రాజు , రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.






