శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ పండుగ సందర్భంగా బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ అని అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21 పెతర అమావాస్య రోజు నుంచి ఘనంగా ప్రారంభం అయిందని, 9 రోజుల పాటు గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారని అన్నారు. ఈ నేపథ్యంలో తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారని తెలిపారు. బతుకమ్మను పేర్చడానికి ముందు రోజే మహిళలు పొలాలు, చెట్లు, గట్లు తిరుగుతూ అందమైన రంగు రంగుల పూలను కోసి తీసుకొస్తారు. మొదటి రోజున బతుకమ్మను పేర్చే పూలలో ప్రధానంగా తంగేడు, గునుగు, తామర, చామంతి పూలు, బంతి పూలు, సీత జడలు ఎక్కువగా ఉపయోగిస్తారు. మొదట తంగేడు పూలు అమర్చిన తర్వాత రంగుల ఆధారంగా ఇతర పూలను అమరుస్తారని తెలిపారు. ముందు రోజే తెచ్చిన పూలను వాడిపోకుండా నీటిలో వేసి ఉంచుతారని, ఇలా చేయడం వల్ల పూలు నిద్ర చేస్తాయని, అందుకే వీటితో అమర్చే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారని అన్నారు.






