శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): అరుదైన వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న ఓ యువతికి హఫీజ్ పేట్ యువ నాయకుడు ధాత్రినాథ్ గౌడ్ సహాయం అందజేశారు. జనప్రియ నగర్ లో నివసించే పద్మజ అనే యువతి అరుదైన వ్యాధితో బాధ పడుతూ పరిస్థితి విషమించడంతో తప్పనిసరిగా సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్జరీకి రూ.3 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. సమయానికి ఆమె కుటుంబ సభ్యుల వద్ద అంత డబ్బు లేకపోవడంతో సహాయం కోసం ఎదురుచూస్తున్నారని జనప్రియ నగర్, ఫేజ్ -2 అసోసియేషన్ సభ్యుల ద్వారా తెలుసుకున్న ధాత్రినాథ్ గౌడ్ వెంటనే వారి వద్దకు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకొని ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు సమాకూర్చే విధంగా ప్రయత్నం చేయడం చేశారు. కానీ అంత సమయం లేకపోవడంతో ముందుగా తన వంతు సహాయంగా తన NMG సేవా ట్రస్ట్ ద్వారా సహాయం చేశారు. అలాగే కాలనీ సభ్యులను కూడా సహాయం చేయవలసిందిగా అభ్యర్థించారు. ఇందుకు కాలనీ సభ్యులు కూడా వెంటనే స్పందించి తలా కొంత డబ్బు సహాయం చేశారు. దీంతో అప్పటికప్పుడు దాదాపుగా రూ.2 లక్షలకు పైగా నిధులు సమకూరాయి. కానీ వైద్య చికిత్సకు ఇంకా డబ్బు అవసరం ఉంది కనుక దాతలు సహాయం చేయాలని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతిని కాపాడాలని ధాత్రి నాథ్ గౌడ్ కోరారు. సహాయం చేయదలచిన వారు జనప్రియ నగర్ కాలనీ సభ్యులను సంప్రదించాలని కోరారు.






