శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో ఒలంపిక్స్ లో మూడుసార్లు హాకీలో బంగారు పతకాలు సాధించిన మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం, గిడుగు వెంకట కృష్ణమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరైన జాతీయ బాక్సింగ్ క్రీడాకారిణి, కోచ్ ప్రసన్న చౌదరి విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరచడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దేశ గౌరవాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. మార్షల్ ఆర్ట్స్ కోచ్ లక్ష్మణ్ తన శిష్యులతో కలిసి ఉత్సాహభరితమైన మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన చేశారు. చందానగర్ పోస్టుమాస్టర్, వాలీబాల్ కోచ్ వెంకట గౌడ్ విద్యార్థులకు క్రీడల ప్రాధాన్యతను సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ సాధించిన నందకిషోర్, రెడ్ బెల్ట్ హోల్డర్ ఉదయ్, రెడ్ బెల్ట్ సాధించిన గోవర్ధన్, ఆదిత్య తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం అతిథులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీలు M.రఘునందన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





