శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి నేపథ్యంలో ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, నేతాజీనగర్ కాలనీ అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ అన్నారు. జిహెచ్ఎంసి సహకారంతో నేతాజీ నగర్ కాలనీలో నిర్వహించిన ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించి చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయని, దీంతో పర్యావరణం దెబ్బ తింటుందని అన్నారు. కనుక అందరూ మట్టి వినాయకులనే పూజించాలని కోరారు. అలాగే వినాయక చవితి ఉత్సవాలను అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మండప నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి సూపర్వైజర్ భరత్ రెడ్డి, సూపర్వైజర్ రాందాస్, సిబ్బంది, నేతాజీ నగర్ అసోసియేషన్ సభ్యులు శంకర్ మార్వాడి, మణికంఠ, మురుగన్ వేలు, సాయిచంద్ పైల్వాన్, అశోక్, రాజు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.






