శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జీహెచ్ఏంసీ జోనల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వి. ప్రశాంతి ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రుల పండుగ ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సదుపాయాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో జీహెచ్ఏంసీ అధికారులు, పలు ఉత్సవ కమిటీ సభ్యులతో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రతి మండపం దగ్గర స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ కోరారు. వర్షాలు పడినప్పుడు మండపాల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రధానంగా చర్చించారు. వినాయక విగ్రహాల ఎత్తుకు సంబంధించి ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఎటువంటి కేబుల్స్ అడ్డు తగలకుండా తీసుకువాల్సిన జాగ్రత్తలు, కరెంటు కేబుల్స్ విషయంపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవటం గురించి చర్చించారు.

వినాయక మండపాల దగ్గర దోమల నిర్మూలన కోసం ఎంటమాలజీ సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని హమీద్ పటేల్ కోరారు. వినాయక మండపాల దగ్గర ఎక్కడ కూడా వర్షపు నీళ్లు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ తోపాటు జీహెచ్ఏంసీ డిప్యూటీ కమిషనర్ వి. ప్రశాంతి, ఇంజనీరింగ్ విభాగం ఈఈ కే. శిరీష, డీఈ ఆనంద్, ఏఈ భాస్కర్, ఏసీపి వెంకటరమణ, ఏఏంసీ ప్రేమ్, ఏఏంహెచ్వో శ్రీకాంత్ రెడ్డి, పిఓ మల్లీశ్వరి, ఇతర అధికారులు, పలు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.





