శేరిలింగంపల్లి, జూలై 24 (నమస్తే శేరిలింగంపల్లి): భారాస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను శేరిలింగంపల్లి నియోజకవర్గంలో యువనేత రవీందర్ యాదవ్ ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ పిలుపులో భాగంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు చోట్ల గుడిసెలలో నివసిస్తూ, వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు తన వంతు సహాయం చేశారు. వారికి రెయిన్ కవర్స్ ను పలు ప్రాంతాల్లో రవీందర్ యాదవ్ పంపిణీ చేశారు. హఫీజ్ పేట్, చందానగర్, మాదాపూర్ తో పాటు పలు ఏరియాల్లో గుడిసెల్లో నివసిస్తున్న వారిని కలిసి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారంతా భారాస పాలనలో అందిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు.

కాంగ్రెస్ సర్కార్ తమకు సహకారం అందించడం లేదని రవీందర్ యాదవ్ తో వాపోయారు. నిజమైన లబ్ధిదారులకు కాకుండా నచ్చిన వారికి ఇచ్చుకుంటూ వెళ్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని రవీందర్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ రానుంది భారాస సర్కార్ అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని, పేదల కోసం అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. కేటీఆర్ హయాంలోనే హైదరాబాద్ ప్రగతి పరుగులు పెట్టిందని, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారు. వచ్చే ప్రతి ఎన్నికల్లో భారాస విజయం ఖాయం అని రవీందర్ యాదవ్ స్ఫష్టం చేశారు.





