- ప్రజలకు సూచనలు చేసిన పోలీసులు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సిబ్బంది
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. మంగళవారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ముహ్ బంద్ రఖో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితిలోనూ వ్యక్తిగత, విలువైన సమాచారాన్ని అపరిచిత వ్యక్తులకు చెప్పకూడదన్నారు. ప్రజలు తమ బ్యాంకింగ్ వివరాలను ఇతరులు ఎవరికీ షేర్ చేయరాదన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధులను సీపీ ఈ సందర్బంగా అభినందించారు.

కాగా ఈ కార్యక్రమం ఈ నెల 21వ తేదీ వరకు జరగనుంది. ఈ క్రమంలో రానున్న 4 నెలల్లో ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు హెచ్డీఎఫ్సీ ప్రతినిధులు 1వేయి వరకు వర్క్ షాప్లను నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అవేర్నెస్ వీక్ 2020కి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని హెచ్డీఎఫ్సీ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ జోనల్ హెడ్స్ ఆర్వీజీ కులకర్ణి, దేవరాజ్ గుప్తా, రీజినల్ హెడ్ జి.అరవింద్, క్లస్టర్ హెడ్ తాజుద్దీన్ మసూద్, సిబ్బంది సోమ శేఖర్ రావు, సాయి ఉదయ్ కుమార్, శ్రమిష్ట, గాయత్రి దేవులపల్లి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీసులు, బ్యాంక్ సిబ్బంది సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ పలు సూచనలు జారీ చేశారు.
* ఫోన్ ద్వారా అపరిచిత వ్యక్తులకు సున్నితమైన సమాచారాన్ని చెప్పకూడదు.
* సోషల్ మీడియా లేదా ఇతర యాప్స్ ద్వారా వచ్చే లింక్లను క్లిక్ చేయరాదు.
* బ్యాంకులు తమ కస్టమర్లను వారి సమాచారం తెలియజేయాలని ఎన్నడూ అడగవు.
* స్కీంలు, గిఫ్ట్లు, రివార్డులను ఎవరూ ఉచితంగా ఇవ్వరు. దాని వెనుక దురుద్దేశం ఉంటుంది.
* ఇతరులకు బ్యాంక్ కార్డులకు చెందిన నంబర్లు, సీవీవీ, ఎక్స్పైరీ తేదీలు, ఓటీపీలు, యూజర్ ఐడీ, పాస్ వర్డ్లు చెప్పకూడదు. ఫోన్ ద్వారా, మెయిల్, మెసేజ్ ల ద్వారా కూడా ఈ సమాచారాన్ని ఇతరులకు చెప్పకూడదు.
* యూపీఐ యాప్స్కు చెందిన పిన్ నంబర్లు, బ్యాంక్ లాగిన్ కస్టమర్ ఐడీలు చెప్పకూడదు.
* కస్టమర్లు అడ్రస్, కాంటాక్ట్ నంబర్లను మారిస్తే వెంటనే బ్యాంక్ వద్దకు వెళ్లి ఆయా వివరాలను మార్పించుకోవాలి.