నమస్తే శేరిలింగంపల్లి: అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో ప్రతి శనివారం జరిగే అన్నమ స్వరార్చన, నృత్యార్చన కార్యక్రమంలో ఈ శనివారం స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామికి నృత్య కైంకర్యం జరిగింది.

తొలుత శోభా రాజు విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, గురుస్తుతితో ప్రారంభించారు. అనంతరం ధూళిపాళ్ళ రామశర్మ తమ వేణుగాన ప్రదర్శనతో అందరిని అలరించారు. ఇందులో భాగంగా, “వాతాపి గణపతిం భజే, ప్రభుం ప్రాణ నాదం, తిరుమల గిరి రాయ, శరణు శరణు, భావము లోన, బాహ్యము నందును, ఓం నమో భగవతే వాసుదేవాయ, కొండలలో నెలకొన్న, హరివరాసనం, చూడరమ్మ సతులాల,” వంటి ప్రముఖ సంకీర్తనలకు మృదు మధురంగా వేణుగానం చేశారు. తబలాపై రమేష్ బృందావని వాయిద్య సహకారం అందించారు. తదనంతరం కళాకారులను సంస్థ అధ్యక్షులు డా. శోభా రాజు శాలువా జ్ఞాపికతో సత్కరించారు.





