శేరిలింగంపల్లి, జూలై 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎన్క్లేవ్ కాలనీలో సీనియర్ నాయకుడు డీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మొవ్వ సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రసాద్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. ఎలాంటి లక్షణాలు కనిపించని ఆరోగ్యవంతులలో కూడా క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.

ప్రస్తుత జీవనశైలిలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. అన్ని రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. అలాగే సీజనల్ వ్యాధులను నివారించేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. శిబిరానికి కాలనీవాసుల నుంచి విశేష స్పందన లభించగా, పెద్ద సంఖ్యలో ప్రజలు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన ప్రసాద్ ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులను ఆరెకపూడి గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. సమాజ ఆరోగ్య సంరక్షణ, క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించేందుకు ప్రసాద్ ఫౌండేషన్ ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





