చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా పూర్తి చేసిన 402 మంది పట్టభద్రుల ఓటర్ నమోదు వివరాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి చందానగర్ తెరాస సీనియర్ నాయకుడు మిర్యాల రాఘవ రావు, మిర్యాల ప్రీతమ్ లు మంగళవారం అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయంలో మంత్రి కేటీఆర్ ఓటరు నమోదు విషయమై దిశా నిర్దేశం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు చేసుకోవాలని, గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు.
ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు అందరూ తమ ఓట్లను, తమ కుటుంబ సభ్యుల ఓట్లను నమోదు చేయించుకోవాలని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి కార్యకర్త అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకుని ఓటరుగా నమోదు చేయించుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు తాజా ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతాయని, పాత ఓటు హక్కు కలిగిన వారు కూడా మళ్ళీ ఓటు నమోదు చేసుకోవాలని తెలియయజేశారు. 2017 సంవత్సరం కంటే ముందు డిగ్రీ, ఇంజనీరింగ్ లలో ఉత్తీర్ణులైన వారు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లుగా నమోదు చేయించుకోవడానికి అర్హులని తెలిపారు. ఈ ఓటరు నమోదు ప్రక్రియ నవంబర్ 6 వ తేదీ వరకు నిర్విరామంగా కొనసాగుతుందని ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.





