చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ బస్తి, కైలాష్ నగర్ బస్తి, వేమన వీకర్ సెక్షన్ బస్తీలలో స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి సోమవారం పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద ముప్పు పొంచి ఉందని బస్తీల వాసులను అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ సూచన మేరకు రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచనల నేపథ్యంలో రాత్రి సమయంలో జాగ్రత్తగా ఉండాలని, నీరు వచ్చే అవకాశం ఉంటే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బస్తి వాసులకు తెలియచేశారు.

శాంతినగర్ లో ముంపు ప్రాంతాల శానిటేషన్…
చందానగర్ డివిజన్ శాంతి నగర్ లో పర్యటించి కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి గత 3 రోజులుగా వర్షపు నీరు నిలిచి ఉన్న ప్రదేశాలను శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షాలు, వరద సమస్యల నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






