నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ మైనర్ బాలికపై వేధింపుల కేసులో దురుసుగా ప్రవర్తించిన చందానగర్ ఎస్ఐ శ్రీనివాసులు పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చర్యలు తీసుకున్నారు. మైనర్ బాలిక తండ్రి తమకు న్యాయం చేయాలని చందానగర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తే న్యాయం చేయాల్సిన పోలీసులు నిర్లక్ష్యం వహించడమే గాకుండా సదరు ఎస్ఐ శ్రీనివాసులు మైనర్ బాలిక తండ్రిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాడని ఆరోపించారు. ఈ ఆరోపణలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఏసీపీ స్థాయి అధికారితో విచారణ జరిపించారు. విచారణ అనంతరం ఎస్ ఐ శ్రీనివాసులుపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చర్యలు తీసుకుంటూ సైబరాబాద్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.






