నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడాన్ని మాదాపూర్ పోలీసులు అడ్డుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన మాదాపూర్ పోలీసులు 40 టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వత్ నగర్ ఎస్ బీ ఐ కాలనీలో ఒక ఓపెన్ ప్లాటులో రేకుల గదిలో నుంచి ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపిన 20 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఏపీ 23వై 7508 నంబర్ గల లారీని అడ్డుకున్నట్లు తెలిపారు. గదిలో మరో 20 టన్నుల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అక్కడే ఉన్న జితేంద్ర ను విచారించగా పర్వత్ నగర్, బోరబండ, మాదాపూర్ తదితర ప్రాంతాలలోని పేదల వద్ద రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఖాన్ సాబ్ కు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక కు చెందిన జితేంద్రను, లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని తూనికలు చేపట్టి పౌరసరఫరా శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.