నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పార్కుల పరిస్థితి పూర్తి అధ్వాన్నంగా మారిందని, కనీస మెయింటనెన్స్ చేయలేని దుస్థితిలో జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. చందానగర్ గౌతమీ నగర్ కాలనీలోని మున్సిపల్ పార్కును హై కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవీడీఎం అధికారులు కాపాడడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పార్కును కాపాడడంతో పాటు ఈవీడీఎం అధికారులు పార్కులో గ్రీనరి, తదితర సామాగ్రిని ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారన్నారు. ఇంతవరకు బాగానే ఉన్న పార్కులో ఏర్పాటు చేసిన గ్రీనరీని, మొక్కలను కాపాడడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారని కసిరెడ్డి భాస్కర రెడ్డి పేర్కొన్నారు. ప్రజల డబ్బులతో పార్కులను అభివృద్ధి చేసి మెయింటనెన్స్ పేరుతో కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై కాంట్రాక్టర్, అటవీశాఖ అధికారులను సంప్రదించగా చేసిన పనులకే పేమెంట్లు రావడం లేదంటూ చేతులెత్తేశారని వాపోయారు. డీసీ, జడ్సీ స్పందించి పచ్చదనాన్ని కాపాడి పార్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.