నమస్తే శేరిలింగంపల్లి: వరల్డ్ స్ట్రోక్ డే ను పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్ లో సమగ్రమైన స్ట్రోక్ సెంటర్ ను ప్రారంభించడంతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ సింపోసియం ను శనివారం నిర్వహించారు. న్యూరోలాజిస్ట్స్ డాక్టర్లు రంజిత్, విక్రమ్ కిశోర్, న్యూరో సర్జన్స్ డాక్టర్లు అనీల్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, క్రిటికల్ కేర్ యూనిట్ హెడ్ ఘన్ శ్యామ్ యం జగత్కర్, రేడియాలజీ హెచ్ఓడీ డాక్టర్ ఎల్ విజయ్ కుమార్, ఎమర్జెన్సీ మెడిసిన్ డైరెక్టర్ సతీష్ కైలాసం, నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రంజిత్ మాట్లాడుతూ మెదడులోని ఒక భాగానికి రక్తప్రసరణకు అవరోధం ఏర్పడినా, ఆగిపోయినా, తగ్గిపోయినా స్ట్రోక్ వస్తుందన్నారు. బ్రెయిన్ టిష్యూకు ఆక్సిజన్ తో పాటు పోషకాలు అందవన్నారు. స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జన్సీ అని సరైన సమయానికి ట్రీట్మెంట్ ముఖ్యమన్నారు. ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే బ్రెయిన్ డ్యామేజ్ అనేది అంత త్వరగా తగ్గుతుందన్నారు. లక్షణాలు ప్రారంభమైన 4 నుంచి 5 గంటల వరకు ఇంట్రావీనస్ థ్రోమోబోలిసిస్ చేయవచ్చన్నారు. పెద్ద ధమనులు మూసుకుపోవడం వల్ల తీవ్రమైన ఇస్కీమిక్ స్ట్రోక్ ఉన్న రోగులకు మెకానికల్ థ్రోంబెక్టమీ సూచించబడుతుందన్నారు. మెకానికల్ థ్రోంబెక్టమీని అర్హత కలిగిన రోగులలో లక్షణాలు కనిపించిన 24 గంటల వరకు చేయవచ్చన్నారు. కొన్ని స్ట్రోక్ కేంద్రాలు మాత్రమే ఈ చికిత్సను నిర్ణీత వ్యవధిలో అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయని వాటిలో ఒకటి మెడికవర్ హాస్పిటల్స్ అన్నారు. డాక్టర్ విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ థ్రోంబెక్టమీ సదుపాయం అందుబాటులో లేని ఆసుపత్రులకు హాజరైనట్లయితే, అర్హత కలిగిన రోగులు ఇంట్రావీనస్ RTPAతో ప్రామాణిక చికిత్సను పొందవచ్చన్నారు. పెద్ద నాళాలు మూసుకుపోతే, వాటిని టెరిటరీ స్ట్రోక్ కేర్ యూనిట్కి బదిలీ చేయవచ్చని, దానిని డ్రిప్ అండ్ షిప్ పద్ధతి అంటారు. డాక్టర్ అనీల్ కుమార్ న్యూరోసర్జన్ మాట్లాడుతూ స్ట్రోక్ అనేది కొన్నిసార్లు టెంపరరీ లేదా శాశ్వతమైన వైకల్యాలు దారితీస్తుందన్నారు. బ్రెయిన్ లో బ్లడ్ ఫ్లో ఎంతకాలం నుంచి తగ్గింది, బ్రెయిన్ లోని ఏ భాగం ప్రభావితమైందన్న విషయంపై సమస్య తీవ్రత ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాక్టర్ సతీష్ కుమార్ కైలాసం మాట్లాడుతూ ఎటువంటి ఎమర్జెన్సీ బ్రెయిన్ స్ట్రోక్ అయినా 24/7 అందుబాటులో ఉండే డాక్టర్స్, ఇతర వైద్య సిబ్బంది, పేషెంట్ కు తక్షణమే సరైన వైద్యం సరైన సమయంలో అందిచడమే లక్ష్యంగా సమగ్రమైన న్యూరో సెంటరును ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మందికి పైగా డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.






