నమస్తే శేరిలింగంపల్లి: కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన 29 మంది లబ్ధిదారులకు రూ. 29.3 లక్షల చెక్కులను కార్పొరేటర్లు రోజాదేవి రంగరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావుతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా నిలిచిందన్నారు. సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు భద్రయ్య, కార్తిక్ రావు, హరినాథ్, కాశినాథ్ యాదవ్, అల్లం మహేష్, ఎల్లంనాయుడు, రఘునాథ్, యశ్వంత్, శ్రావణి రెడ్డి, రాదా బాయి తదితరులు పాల్గొన్నారు.