- స్త్రీ లేనిదే ప్రపంచం లేదు: కమీషనర్ వీ.సి.సజ్జనార్
నమస్తే శేరిలింగంపల్లి: స్త్రీ సమస్త ప్రపంచానికి ఆధారమని, ఆమె లేనిదే ప్రపంచమే లేదని సైబరాబాద్ కమీషనర్ వీ.సి.సజ్జనార్ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ల సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోగల టెక్ మహీంద్రా సంస్థలో వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో దాదాపు 500 మంది మహిళలు జూమ్ యాప్ ద్వారా పాల్గొనగా ఫేస్బుక్లో ప్రత్యక్షప్రసారం చేశారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెలగోపీచంద్, క్రీడాకారిణి మాన్సి జోషి కమీషనర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ నిర్ణయించిన చూజ్ టు ఛాలెంజ్ థీమ్తో వేడుకలు నిర్వహిస్తున్నామని, మహిళలు పోలీసు రంగంలోని అన్ని విభాగాల్లో సత్తా చాటాలని తాను ఛాలెంజ్ చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత గురించి ఎంతోమంది మాట్లాడుతారని, పుల్లెల గోపీచంద్ దానిని నిజం చేసి చూపిస్తున్నారని తెలిపారు. అనంతరం గోపిచంద్ మాట్లాడుతూ మన సంస్కృతి స్త్రీలను గౌరవించడం నేర్పుతుందని, చిన్నతనం నుండి పిల్లల్లో స్ర్తీలపట్ల గౌరవం పెంపొందేలా చూడాలన్నారు. తన భార్య ఎయిర్పోర్టు నుండి ఇంటికి దైర్యంగా రాగలుగుతుందని, మహిళలకు భద్రత అందిస్తున్న షీ టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు పలు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ వేడకల్లో డిసిపి అనసూయ, ఎస్సిఎస్సి కార్యదర్శి క్రిష్ణ ఎదుల, మహిళా ఫోరం సంయుక్త కార్యదర్శి ప్రత్యూష శర్మ, డిసిపిల పద్మజ, వెంకటేశ్వర్లు, టెక్ మహీంద్రా ప్రతినిధి వినయ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.






