శేరిలింగంపల్లి, జూన్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): ఒక వార్డు ప్రతిరోజు కార్యక్రమంలో భాగంగా సీఎంసీ కమిషనర్ జి. సృజన నార్సింగి సర్కిల్ పరిధిలోని నేకునాంపూర్ వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఆమెతోపాటు శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, ఉప కమిషనర్ లక్ష్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక నివాసితులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై వార్డు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వీధి దీపాల ఏర్పాటు, ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్, ఫుట్పాత్లపై ఆక్రమణల తొలగింపు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ సామర్థ్యాన్ని పెంచడం, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, పార్కుల్లో లైటింగ్, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వైన్ షాపుల తరలింపు, పాషా కాలనీలో నీటి నిల్వ సమస్య వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇస్తామని కమిషనర్ సృజన హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో సంబంధిత విభాగాల అధికారులు కూడా పాల్గొని స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలపై చర్చించారు.






