బాగ్లింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): బాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్లో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (ఏఐఎఫ్డిఎస్) రాష్ట్ర కమిటీ సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, ఏఐఎఫ్డివై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యాసంస్థలు తెరుచుకోగానే సంవత్సరానికి ఎంత ఫీజు ఉంటుందో అంత మొత్తం ఒకేసారి కట్టాలని విద్యార్థులను మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని, తరగతి గదులలో పాత పద్ధతిలోనే విద్యార్థులను కూర్చోబెట్టి తరగతులను నిర్వహిస్తున్నారని అధికారులు స్పందించి విద్యాసంస్థలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. తక్షణమే సంక్షేమ హాస్టళ్లను ప్రారంభించాలని, ఘట్కేసర్ లో బీ ఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ తో పాటు నలుగురు అత్యాచారానికి పాల్పడటం జరిగిందని, ఈ ఘటనకు కారకులైన వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష విధించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి బండారు చిరంజీవి, పల్లె మురళి పాల్గొన్నారు.






