సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇద్దరు బాలికలపై లైంగిక దాడి చేసినందుకు గాను ఓ వ్యక్తికి న్యాయమూర్తి జైలు శిక్షతోపాటు ఫైన్ విధించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగటూరు గ్రామానికి చెందిన ఎస్ రాజు (45) కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా 2016, డిసెంబర్ 21వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు అదే గ్రామానికి చెందిన 8, 9 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలను అతను తన ఇంటికి తీసుకెళ్లి వారిపై లైంగిక దాడి చేశాడు. తరువాత రెండు రోజులకు.. అంటే.. 2016, డిసెంబర్ 23వ తేదీన ఉదయం 6.30 గంటల సమయంలో వారిలో ఓ బాలిక ఇంట్లో ఏడుస్తుండగా.. తల్లిదండ్రులు నిద్రలేచి విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారికి జరిగిన విషయం తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజును అరెస్టు చేసి పలు మార్లు విచారించారు. అలాగే కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ క్రమంలో అతను నేరం చేసినట్లు నిర్దారణ కావడంతో శుక్రవారం ఎల్బీ నగర్ ఎంఎస్జే కోర్టు న్యాయమూర్తి బి.సురేష్ రాజుకు పోక్సో చట్టం కింద 4 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.10వేల ఫైన్ విధించారు.





