చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వ్యక్తిని చందానగర్ పోలీసులు హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుడా కాలనీలో ఈ నెల 3వ తేదీన ఓ వ్యక్తి రహదారి పక్కన స్ఫృహ తప్పి పడిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో చేర్పించారు. అనంతరం అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ వ్యక్తికి మెరుగైన చికిత్సను అందించేందుకు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఆ వ్యక్తి వయస్సు సుమారుగా 60 సంవత్సరాలు ఉంటుందని, ఎవరైనా గుర్తు పట్టదలిస్తే 04027853911,9490617118,7901113092 అనే ఫోన్ నంబర్లకు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.






