సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇన్స్టంట్ లోన్ యాప్ల బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు శుక్రవారం ఆర్బీఐ అధికారులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఇన్స్టంట్ లోన్ యాప్ల సంఖ్య పెరుగుతుండడం, వాటిల్లో లోన్లను తీసుకుంటూ ఆ అప్పులను చెల్లించలేక అనేక మంది ఇబ్బందులు పడుతుండడం, ఇన్స్టంట్ లోన్ యాప్ల నిర్వాహకుల ఆగడాలు శృతి మించుతుండడంతో వారు ఆయా అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అలాంటి లోన్ యాప్లపై ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు అద్భుతమని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. ప్రజలు ఆర్బీఐ అనుమతి ఉన్న యాప్ల నుంచే లోన్లను తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు అలాంటి యాప్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఐజీ రాజేష్ కుమార్, హైదరాబాద్ సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతీ, శంషాబాద్ డీసీపీ ఎన్.ప్రకాష్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, రాచకొండ సైబర్ క్రైమ్స్ ఏసీపీ హరినాథ్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్, సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది, ఆర్బీఐ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







