నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికను జిహెచ్ఎంసి వెస్ట్జోన్ కమీషనర్ రవికిరణ్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, డి వెంకటేశం ముదిరాజ్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి వారు 22 మార్చి 1993 నుంచి ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహిస్తున్నారని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నీటి సంక్షోభాన్ని నివారించేందుకు తీసుకోవలసిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈ భూమి మీద ఉన్న నీటిలో 0.3 శాతం మాత్రమే త్రాగటానికి పనికి వచ్చే నీరు అని, ఆ కొద్దిపాటి నీటిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం ఉపయోగించుకోవాలన్నారు. ఈ భూమి మీద సకల జీవరాసులకు గాలి తరువాత అత్యంత ప్రధానమైనది నీరు మాత్రమే అని, త్రాగునీరు లభించక అభివృద్ధి చెందుతున్న దేశాలలో వివిధ రకాల రుగ్మతలకు గురై ప్రాణ నష్టం జరుగుతుందని తెలిపారు. నీటి వినియోగం లో వృధా, లీకేజ్ లను అరికట్టాలని తెలిపారు. పారిశ్రామీకరణ నేపధ్యంలో నదులు , చెరువులు , కుంటలు , భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని అవి కలుషితము కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. ప్రకృతి ప్రసాదించిన ఈ మంచి నీటి వనరులను భవిష్యత్తు తరాలకు అందించాలంటే నీటి పొదుపు మరియు నీటి ప్రాముఖ్యత ను ప్రజల్లో అవగాహన పెంచటానికి ప్రభుత్వంతో పాటు పౌరసమాజం , స్వచ్చంద సంస్థలు కృషి చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణుప్రసాదు, వాణి సాంబశివరావు , కొవ్వూరు అశోక్ , పాలం శ్రీను , నల్లగొర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
