మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్లో ప్రశ్నార్థకంలో పడ్డ టిఆర్ఎస్ పార్టీ భవితవ్యాన్ని కాపాడేందుకు మజ్లీస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ కు గులాంగిరి చేస్తోందని బిజెవైఎం రాష్ట్ర నాయకులు రాగిరి సాయిరాంగౌడ్ విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి ఎంఐఎం పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పటికీ అభ్యర్థులందరూ ఉపసంహరించుకోవడం పై సాయిరాం స్పందించారు. టిఆర్ఎస్ నాయకులు తమకు ఏ పార్టీ తో పొత్తు లేదని ఓ వైపు చెప్తూనే మరోవైపు రెండు పార్టీలు అంతర్గత ఒప్పందాలతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని తెలిపారు. ఎంఐఎం అభ్యర్థులు నామినేషన్ల వేసిన కొండాపూర్, హఫీజ్ పెట్ డివిజన్లలో మైనారిటీ వర్గాల ఓట్లు చీలకుండా రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయని తెలిపారు. గ్రేటర్ లో రెండవ అతిపెద్ద పార్టీ అని, మొన్న బీహార్ లో ఐదు సీట్లు గెలిచామని జబ్బలు చరుచుకొనే ఎంఐఎం నాయకులు శేరిలింగంపల్లి లో నామినేషన్లు వేసిన అభ్యర్థులను సైతం పోటీలో నిలబడకుండా వెనక్కి లాగడం సిగ్గుచేటన్నారు. మజ్లీస్ పార్టీకి సైతం స్వార్ధ ప్రయోజనాలే తప్ప పార్టీ కార్యకర్తల మనోభావాలనులెక్క చేయదని తెలిపారు. ఎంఐఎం పోటీ చేసే స్థానాల్లో సైతం టిఆర్ఎస్ పార్టీ, హిందువుల ఓట్లు చీల్చేందుకు తమ అభ్యర్థులుగా హిందువులను ఎంపిక చేసి మజ్లీస్ గెలుపుకు పరోక్షంగా సహకరించడం అందరికి తెలిసిందేనని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి డివిజన్ నుండి పోటీ చేసిన ఎంఐఎం ఈసారి పూర్తిగా టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచిందన్నారు. మైనారిటీ వర్గాల్లో ముస్లిం ఓటర్లు చైతన్యమయ్యారని వారంతా బిజెపికి మద్దతు తెలిపేందుకు సిద్దమయ్యారన్నారు. గ్రేటర్ ప్రజలు టిఆర్ఎస్, మజ్లీస్ పార్టీల కుట్రలను గమనించాలని, ఓటర్లంతా బీజేపీకి ఓటువేసి నగర అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు.