నమస్తే శేరిలింగంపల్లి: మహాత్మా జ్యోతీరావు పూలే 194వ జయంతి వేడుకలను ఆదివారం గచ్చిబౌలి డివిజన్ పరిధి సాయినగర్ లో గల శిశుమంగళ్ అనాధ శరణాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామియాదవ్ జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం రామస్వామి యాదవ్ మాట్లాడుతూ తరతరాలుగా అణగారిన వర్గాలు సాంఘికంగా ఆర్ధికంగా, రాజకీయంగా అసమానతలకు గురైన వారి హక్కులకై పోరాటం చేసిన గొప్ప మహానీయుడు పూలే అని కొనియాడారు. బహుజనుల సర్వతోముఖాభివృద్ధికి కేవలం విద్య ద్వారానే అని భావించి ఈ వర్గాల అక్షరాస్యతకు కృషిచేసిన గొప్ప దార్శనికుడు అని అన్నారు. తన భార్య సావిత్రిభాయ్ పూలే తో కలసి మహిళా అక్షరాస్యతకు , మహిళాభివృద్ధికి కృషి చేసిన గొప్ప పుణ్య దంపతులు అని అన్నారు. వితంతు వివాహాలను ప్రోత్సహించడం , అనాధ శరణాలయాలు ఏర్పాటు చేయటం , వయోజన విద్యకు , బాల బాలికల విద్యకు అనేక పాఠశాలలు స్థాపించి బహుజనులలో ఆత్మస్థైర్యాన్ని కలిగించారన్నారు. అసమానతలు లేని దేశంగా భారతదేశం ఉండాలని మహాత్మా పూలే కలలు కన్నాడో , ఆయన ఆలోచనలును , ఆయన వారసత్వంను ,వ్యక్తిత్వాన్ని కొనసాగించాలని మాన్యశ్రీ సాహు మహరాజ్ , డాక్టర్ బిఆర్ అంబేద్కర్ , నారాయణగురు , పెరియార్ రామస్వామి నాయకర్ , కర్పూరి ఠాకూర్ , కాన్షిరామ్ లాంటి ఎందరో మహానుభావులు సమతా వాదాన్ని కొనసాగించి మనఅందరికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. నేటి యువత మహాత్మా పూలే దంపతుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బహుజనుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామ్మోహనరావు , విష్ణుప్రసాదు , జనార్దన్ , జిల్ మల్లేష్ , వెంకటేశ్వరరావు ఆశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






