శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను వృథా కానివ్వమని, వారి త్యాగాల పునాదుల మీదనే మనం ఈ స్వాతంత్య్ర భారతావనిని నిర్మించుకుందామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ అన్నారు. మన స్వాతంత్ర్య పోరాటం కేవలం ఒక పోరాటం కాదు, అది లక్షలాది మంది జీవితాల త్యాగాల నుంచి పుట్టిన అద్భుతమైన చరిత్ర అని అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొండాపూర్, మాదాపూర్, వివేకానంద నగర్, కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, మియాపూర్, హఫీజ్పేట్ , గచ్చిబౌలిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ వంటి అనేక మంది త్యాగధనులను స్మరించుకుందామన్నారు. వారు మనకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే విలువలను ఇచ్చారని, అల్లూరి సీతారామరాజు వంటి తెలుగు వీరులు కూడా స్వాతంత్ర్య సమరంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారని, వారి త్యాగాల పునాదుల మీదనే మనం ఈ స్వాతంత్ర్య భారతావనిని నిర్మించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా డివిజన్ అధ్యక్షులు, మహిళా మోర్చా, ఓ బి సి మోర్చా, యువ మోర్చా, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






