- ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని చందానగర్లోని సూపర్ విజ్ జూనియర్ కాలేజీలో వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీల చిత్రపటాలకు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ న్యాయవాదిగా, రైతు నాయకుడిగా, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, భారత ఉప ప్రధానిగా భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు.

నిజాం నిరంకుశత్వం నుండి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించిన మహానీయుడని కొనియాడారు. ఇందిరాగాంధీ కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా దేశాభివృద్ధికి కృషిచేశారన్నారు. గరిబీ హఠావో నినాదంతో రాజభరణాలను రద్దు చేసి, బ్యాంకులు జాతీయం చేసి, అలీన దేశాల అధ్యక్షురాలిగా భారతదేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప జేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, జనార్దన్, ప్రకాశం, రామ్మోహనరావు పాల్గొన్నారు.





