శేరిలింగంపల్లి, సెస్టెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చేపట్టిన వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ జోన్, గాజులరామారం సర్కిల్ పరిధిలోని షాపూర్ నగర్ వార్డులో క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంసీ కమిషనర్ సృజనతోపాటు జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సర్కిల్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక నివాసులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) ప్రతినిధులతో నేరుగా మాట్లాడి వార్డులో నెలకొన్న సమస్యలు, స్థానిక అవసరాలను తెలుసుకున్నారు. ప్రజలు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, పార్కులు, పిల్లల ఆట స్థలాలు, యూజీడీ, వీధి కుక్కల బెడద, ఆక్రమణలు, ట్రాఫిక్, పార్కింగ్, కమ్యూనిటీ సదుపాయాలు తదితర సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.

గణేష్ చతుర్థి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసులకు మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి విగ్రహాలను వినియోగించాలని ప్రజలకు సూచించారు. ప్రజలు వెల్లడించిన ప్రతి సమస్యను నమోదు చేసి, విభాగాల వారీగా సమీక్షించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని, అవసరమైన చోట ఇతర లైన్ డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుని సకాలంలో చర్యలు చేపట్టాలని సూచించారు. వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై, వార్డు స్థాయిలోని సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, సంబంధిత విభాగాల సమన్వయంతో పరిష్కరించే దిశగా సీఎంసీ చర్యలు కొనసాగిస్తోంది.






