మక్తా–మహబూబ్‌పేట్‌లో బీఆర్ఎస్ టికెట్ రేసులో కాసాని శ్రీధర్ ముదిరాజ్

శేరిలింగంప‌ల్లి, సెస్టెంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మక్తా–మహబూబ్‌పేట్ డివిజన్ 241లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్న వారిలో కాసాని శ్రీధర్ ముదిరాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. స్థానిక ప్రజలతో సన్నిహిత సంబంధాలు, యువతతో అనుబంధం, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే తత్వం ఆయనకు రాజకీయంగా కలిసొచ్చే అంశాలుగా అనుచరులు చెబుతున్నారు. మక్తా–మహబూబ్‌పేట్ ప్రాంతంలో ప్రజలతో శ్రీధర్‌కు ఉన్న పరిచయాలు, సామాజిక కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యం ఆయన అభ్యర్థిత్వానికి బలంగా మారుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

కాసాని శ్రీధర్ ముదిరాజ్ కుటుంబానికి రాజకీయంగా మంచి నేపథ్యం ఉంది. ఆయన తండ్రి కాసాని రామాంజనేయులు గతంలో మాజీ ఉపసర్పంచ్‌గా పనిచేస్తూ ప్రజలకు సేవలందించారు. అలాగే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేవెళ్ల ఎంపీగా రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. కుటుంబానికి ఉన్న రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం శ్రీధర్‌కు అదనపు బలంగా మారుతున్నాయని స్థానిక రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

డివిజన్ 241లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధికి కాసాని శ్రీధర్ ముదిరాజ్‌కు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. పార్టీ టికెట్ లభిస్తే ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని వారు పేర్కొంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని శ్రీధర్ వర్గం చెబుతోంది.

డివిజన్ 241లో బీఆర్ఎస్ కార్పొరేటర్ టికెట్ కోసం పలువురు ఆశావహులు ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కాసాని శ్రీధర్ ముదిరాజ్ పేరు ముందువరుసలో వినిపిస్తుండటం స్థానిక రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం డివిజన్‌లో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here