శేరిలింగంపల్లి, జూలై 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ పరిధిలోని చిరంజీవి నగర్, వీడియో కాలనీ వాసులకు ఎస్ఐఆర్ ఫామ్ను సరైన విధంగా ఎలా నింపాలనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నడిమింటి కృష్ణ హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఫామ్ నింపేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు, సమర్పించాల్సిన అవసరమైన ధ్రువపత్రాలు, వ్యక్తిగత వివరాలను కచ్చితంగా నమోదు చేసే విధానాన్ని ఆయన వివరించారు.

ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే నిస్సంకోచంగా అడగాలని సూచించిన ఆయన, ప్రతి ఒక్కరూ సరైన సమాచారంతో దరఖాస్తులను సమర్పించాలని కోరారు. అవగాహన లోపం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో కాలనీ పెద్దలు, మహిళలు, యువతతోపాటు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫామ్ నింపే విధానంపై వారి సందేహాలకు నడిమింటి కృష్ణ సమాధానాలు ఇస్తూ అవసరమైన సూచనలు అందించారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.





