మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ఓ రోగికి అరుదైన ఆపరేషన్లు చేశారు. ఏక కాలంలో రెండు సర్జరీలు చేసి విజయవంతం అయ్యారు. 22 సంవత్సరాల వయస్సు కలిగిన అఖిల అనే మహిళ 35 వారాల గర్భంతో ఉంది. ఆమెకు గుండె సంబంధ సమస్య వచ్చింది. దీంతో ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. అలాగే పొడి దగ్గు, జలుబు, జ్వరం ఉన్నాయి.

కాగా ఆమె గుండెకు శస్త్ర చికిత్స చేస్తే ఆమె గర్భాశయంలోని శిశువు చనిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. దీంతో మెడికవర్ వైద్యులు అత్యంత చాకచక్యంగా ఏకకాలంలో ఆమెకు రెండు శస్త్ర చికిత్సలు చేశారు. ఒక వైపు గుండెకు సర్జరీ చేస్తూనే మరో వైపు సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. దీంతో రెండు సర్జరీలు విజయవంతం అయ్యాయి. కాగా తల్లీ బిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
ఈ ప్రక్రియలో తీవ్రమైన రక్తస్రావం జరిగిందని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఇద్దరి ప్రాణాలు పోయేందుకు అవకాశం ఉంటుందని, కనుక వైద్యులు చాలా చాకచక్యంగా ఈ ఆపరేషన్లను చేశారని తెలిపారు. ఇందుకు సుమారుగా 5 నుంచి 6 గంటల సమయం పట్టిందన్నారు. ఇలా గర్భంతో ఉన్న మహిళకు ఏక కాలంలో రెండు శస్త్ర చికిత్సలు చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందని, అందులో మెడికవర్ వైద్యులు విజయం సాధించారని హాస్పిటల్ ప్రతినిధులు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో డాక్టర్లు ముఖర్జీ, ప్రభా అగర్వాల్, కృష్ణ ప్రసాద్, బాధితురాలు అఖిల పాల్గొన్నారు.





