శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): గణేష్ చతుర్థి ఉత్సవాలను పురస్కరించుకుని హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ ఆవరణలో వినాయకుని కర్ర పూజా కార్యక్రమాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి కర్ర పూజను ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో వినాయక చవితికి ఎంతో విశిష్టమైన స్థానం ఉందన్నారు. లోకకల్యాణం, ప్రజలందరి మేలు కోసం భక్తి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, భక్తిభావంతో విజయవంతంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన బాలింగ్ గౌతమ్ గౌడ్కు నిర్వాహకులు, స్థానిక భక్తులు ఘనస్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






