శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా.. ఎంత శక్తిమంతమైనదైనా.. అంతిమంగా విజయం మంచినే వరిస్తుందని, మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందని గుర్తు చేశారు. జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత అందరినీ దీవించాలని కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దసరా పండుగను జరుపుకోవాలని, ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అలయ్ బలయ్ లేకుండా దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.






