శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్కను నాటి భావితరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించాలని మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో మయూరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన VGR డయాబెటిస్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు పలు రకాల మొక్కలను పంపిణీ చేయడంతోపాటు అసోసియేషన్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ వేగంగా పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం అత్యంత అవసరమని అన్నారు. ప్రతి కాలనీ, ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్కను నాటడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. మొక్కలు కేవలం చెట్లుగా పెరగడమే కాకుండా ఆక్సిజన్ను అందించే ప్రాణదాతలని, వాటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించే లక్ష్యంతో VGR ట్రస్ట్ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మయూరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిదిండి రాజు, కిషోర్, హరికృష్ణ, ప్రవీణ్ రెడ్డి, రమణా రెడ్డి, నాగరాజు, కృష్ణ కుమార్, సచిన్ కుమార్, వరలక్ష్మి, అఖిల రెడ్డి, VGR డయాబెటిస్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు హరిబాబు, మహేశ్వర్ రెడ్డి తదితరులు, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.





