శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీల సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 25వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో చేపడుతున్న బీసీల సత్యాగ్రహ దీక్షకు వెనుకబడిన తరగతుల ప్రజలు హాజరై హక్కుల సాధన కోసం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తే స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. బీసీలంతా ఐక్యమని ఒక్క గళమై గర్జిస్తే మన హక్కులు మనం సాధించుకోవచ్చని అన్నారు. ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించే బీసీల సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి దొంతిపోయిన శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి సర్వీస్ యాదవ్, కృష్ణ గౌడ్, రాజు ముదిరాజ్, నాయి బ్రాహ్మణ సంఘం రాజేష్, రజక సంఘం కిషోర్, ముదిరాజ్ సంఘం రాజు, బిసి నాయకులు పాల్గొన్నారు.






