శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR-2026) ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి తప్పులకు తావులేకుండా పూర్తి చేయాలని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO), జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ అధికారులను ఆదేశించారు. ఆయన ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో అఖిలపక్ష రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (AEROs), వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నారాయణ్ అమిత్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు, చిరునామా మార్పులు, అలాగే మరణించిన లేదా వలస వెళ్లిన (ASDD) ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLAs) ద్వారా అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ఎన్యుమరేషన్ ఫారాల (Form 6, 7, 8) డిజిటలైజేషన్, వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి బూత్ పరిధిలో BLOలు ఇంటింటికీ సమగ్రంగా పరిశీలన చేపట్టి, అవసరమైన వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన అనుమానాలు, ఫిర్యాదులను ఈఆర్వో నారాయణ్ అమిత్ పరిశీలించారు. వాటిని తక్షణమే పరిష్కరించేలా సంబంధిత AEROsకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియలో ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగస్వాములు కావాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, సూపరింటెండెంట్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.





