శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎస్సీ కులాల, సంచార తెగల ఆత్మీయ సమావేవాన్ని సామాజిక సమరసత వేదిక, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని గీతా భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 21 కులాలకు చెందిన 55 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మేరకు తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ జాబితాలో 59 కులాలు ఉన్నాయన్నారు. ప్రతి కులానికి ఒక కుల దేవత, చరిత్ర ఉందని, 75 సంవత్సరాల రాజ్యాంగం అమలులో అభివృద్ధి ఫలాలు అన్నీ ఎస్సీ కులాలకు సమంగా చేరలేదని అన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. ఎస్సీలకు చెందిన అన్ని కులాల వారు అందరి ప్రగతి కోసం కలసి మెలసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్, తెలంగాణ కన్వీనర్ అప్పాల ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, అజయ్ గౌతమ్, ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్త డా.వెంకట నరసయ్య, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్, సమరసత తెలంగాణ సహ కన్వీనర్ వేణుగోపాల్, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి, కొంపల్లి అరవింద్, ప్రతాప్, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.






