శేరిలింగంపల్లి, నవంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా షేక్ పేట్ డివిజన్ నాలా నగర్ చౌరస్తా ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వద్ద నిర్వహించిన రోడ్ షోలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. 6 అబద్ధాలు , 66 మోసాలతో గద్దెనెక్కిన ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి కొన్నింటిని కూడా సరిగా అమలు చేయలేక చేతులెత్తేసిన ఏకైక ప్రభుత్వమని అన్నారు.

మహిళలకు పెళ్లికి రూ. 1 లక్ష, తులం బంగారం, నెలకు రూ.2500 ఊసే ఎత్తడం లేదన్నారు. విద్యార్థులకు , యువతకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డ్ , ప్రతి విద్యార్థినికి స్కూటీ, రూ.4 వేల నిరుద్యోగ భృతి హామీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ తో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తా అన్నారని, ఇంతవరకు ఎన్ని చేశారని నిలదీశారు. రోడ్ల విస్తరణ , డ్రైనేజ్ లైన్ల గురించి పట్టించుకునే నాథుడే లేడని, కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీలు ప్రజలను ముంచే పార్టీలని, నిజమైన తెలంగాణ అభివృద్ధి కోసం జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించి నూతన శకానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర , జిల్లా, డివిజన్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






